అనవసరంగా గెలిచా.. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి ఆవేదన

  • అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బాధగా ఉందన్న ఎమ్మెల్యే
  • లోపల తిట్టుకోవడం బయట చేతులేసుకుని తిరగడం మామూలుగా మారిందని విమర్శలు
  • ప్రజల కోసం మాట్లాడేవారు అసెంబ్లీలో ఒక్కరూ లేరని ఆరోపణ
  • ఇద్దరు మాట్లాడితే 60 మంది భజన చేస్తున్నారని ఎద్దేవా
  • నాయకుల్లో బాధ్యత కొరవడిందని ఎద్దేవా
తాను ఎమ్మెల్యేగా అనవసరంగా గెలిచి అసెంబ్లీకి వచ్చానని బాధగా అనిపిస్తోందంటూ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. లోపల ఒకరినొకరు తిట్టుకుని బయట మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన తనకు సభలో ఎలా వ్యవహరించాలో తెలుసని చెప్పారు.

గతంలో అసెంబ్లీ మీదుగా వెళ్లేటప్పుడు ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి వెళ్తానా అని అనుకునే వాడినని, ప్రజలకు ఎమ్మెల్యేలు మంచి చేస్తారని భావించేవాడినని గుర్తుచేసుకున్నారు. కానీ, కొందరు జీతాలు తీసుకుని కూడా అసెంబ్లీకి రావడం లేదని, మరికొందరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు నాయకులు మాట్లాడితే మిగతా 60 మంది వారికి భజన చేస్తున్నారని దుయ్యబట్టారు. 

అసలు అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడే నాయకులే లేరని, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాలన్న ఆలోచన కూడా వారికి ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఘోష నేతలకు వినపడడం లేదన్నారు. అంతమాత్రాన తానేం సత్యహరిశ్చంద్రుడిని కాదని చెప్పుకొచ్చారు.

K. V. Ramana Reddy
BJP
Telangana

More Telugu News